– జిల్లా, నియోజకవర్గాలకు సంబంధించి రూపొందించండి
– స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికత లక్ష్యాల పురోగతినీ పొందుపరచాలి
– గౌరవ సీఎం పర్యటన సన్నద్ధతా సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎ.కొండూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాతో పాటు నియోజకవర్గ ప్రగతి నివేదికలను పూర్తిస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్లో ప్లానింగ్, రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో సన్నద్ధతా సమావేశం నిర్వహించారు. స్పష్టమైన ప్రణాళిక ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక పత్రానికి అనుగుణంగా జిల్లాలో లక్ష్యాల సాధనకు తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రగతి అంచనాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని సూచించారు. 15 శాతం వార్షిక అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న చర్యలు, సత్ఫలితాల గణాంకాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి, జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం (పీసీఐ) వృద్ధి గణాంకాలతో ఇన్ఫో గ్రాఫిక్స్ను రూపొందించాలని సూచించారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ దార్శనిక ప్రణాళికల లక్ష్యాలు, ప్రగతితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి చోదక శక్తులైన జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ వంటివాటిపైనా దృష్టిసారించాలని సూచించారు. ఎ.కొండూరుకు కృష్ణా జలాల సరఫరా ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలుతీరును వివరించేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రీసర్వేతోపాటు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రయోజనాలను వివరించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
సమావేశంలో స్టాటిస్టికల్ అధికారి డీవీఎస్ఆర్ ప్రసాద్, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి ఆనంద్, ఆర్డబ్ల్యూఎస్, సర్వే, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News