– ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
– నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరులో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. జిల్లాస్థాయి అధికారులతో కలిసి పాల్గొని స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ప్రత్యేక గ్రీవెన్స్లో మొత్తం 192 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 110 అర్జీలు ఉన్నాయి. అదేవిధంగా ఎంపీడీవోకు 34, డీఆర్డీఏకు 18, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుకు 8, డీఎస్వోకు 7, పౌర సరఫరాల డీఎంకు 5 అర్జీలు అందాయి. పోలీసు, డీసీహెచ్ఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు రాగా, డ్వామా, వ్యవసాయ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలకు అనుగుణంగా ఎ.కొండూరులో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్కు వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు వీలవుతుందన్నారు. అధికారులు నిర్దేశిత గడువులోగా అర్జీలను పరిష్కరించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జేసీ ఇలక్కియ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News