గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో డ్రైన్ క్రాస్ త్రాగునీటి పైప్లైన్ల విషయంలో ఇంజినీరింగ్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో డ్రైన్ క్రాస్ పైప్లైన్ల షిఫ్టింగ్, పూడికతీత పనులు, చలివేంద్రాల నిర్వహణ, బిల్స్ నిధి పోర్టల్లో అప్లోడ్ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బ్రాడీపేటలో డ్రైన్ క్రాస్ పైప్లైన్ల విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎమినిటీ కార్యదర్శి, ఏఈ, డీఈఈ, ఈఈ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్న డ్రైన్ క్రాస్ పైప్లైన్లను వెంటనే షిఫ్ట్ చేయాలని గత రెండు నెలలుగా చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రానికి ఈఈల సంతకాలతో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని, ఇకపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. అదేవిధంగా చలివేంద్రాల్లో త్రాగునీటిని సక్రమంగా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని, మొదటి హెచ్చరికగా గోరంట్ల ప్రాంత ఎమినిటి కార్యదర్శి, ఏఈ, డిఈఈలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. డ్రైన్లలో పూడికతీత పనుల్లో భాగంగా తొలగించిన పూడికను 24 గంటల లోపు వేరే ప్రాంతానికి తరలించాలని, ఈ పనుల్లో బాలకార్మికులను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పని సమయంలో కార్మికులకు తగిన రక్షణ పరికరాలను తప్పనిసరిగా అందించాలన్నారు. నగరంలో జరుగుతున్న, పూర్తయిన అభివృద్ధి పనుల వివరాలను ఈఈల సంతకాలతో రెండు రోజుల్లో అందజేయాలని, పబ్లిక్ టాయిలెట్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
సమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, అదనపు కమిషనర్ (ఇంచార్జి) సాంబశివరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు, వేణు, కళ్యాణరావు, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News