-సుమోటోగా కేసు తీసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో చర్చి పాస్టర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చర్చి పాస్టర్ చౌటపల్లి రాంబాబు, పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత బాలిక కుటుంబానికి పాస్టర్ తరచూ రాకపోకలు ఉండేవి. ఈ పరిచయాన్ని దుర్వినియోగం చేసుకుని బాలికను బెదిరింపులకు గురిచేస్తూ లైంగిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె గర్భవతి అయిన విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే విషయం బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించిన పాస్టర్, బాలికకు మోతాదుకు మించి గర్భస్రావ మాత్రలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాత్రలు మింగిన అనంతరం బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను తెలుసుక్కున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్గా స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి. సూర్యనారాయణ రాజు , సభ్యులు జిల్లా ఇంచార్జి ఉండవల్లి గాంధీ బాబు సోమవారం కళ్లచెరువు గ్రామాన్ని సందర్శించనున్నారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి, పోలీసుల దర్యాప్తు పురోగతి, అధికారుల చర్యలపై సమగ్ర నివేదిక తీసుకోనున్నారు. అలాగే బాలికకు అవసరమైన వైద్య, న్యాయ సహాయం అందించాలని అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Prajavartha Online Telugu News