-ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహనే లక్ష్యం
-ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ – నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సంయుక్తంగా ఆథిత్యం
-MSME రూపురేఖలు మార్చనున్న ‘NSE ఎమర్జ్’
-చిన్న పరిశ్రమలకూ ఇక స్టాక్ మార్కెట్ దన్ను
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు, ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (APMSME Development Corporation) – నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సంయుక్తంగా విజయవాడలోని హోటల్ నోవాటెల్లో ఈ నెల 13వ తేదీ బుధవారం ప్రత్యేక అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగాగా గౌరవనీయులైన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ , నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తో కలిసి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారు.
ఈ సదస్సు నేపథ్యంలో మంత్రి కొండపల్లి స్పందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSMEs) స్థితిగతులను మార్చేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన ప్రత్యేక వేదిక ‘NSE ఎమర్జ్’ (NSE Emerge) ద్వారా సరికొత్త విప్లవానికి నాంది పలికిందన్నారు. ఈ అంశంలో టీడీపీ పార్లమెంటరీ పక్షనేత, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కీలక పాత్ర పోషించారని మంత్రి తెలిపారు.
ఇకపై ఎంఎస్ఎంఈలు నిధుల సమీకరణ కోసం కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా ఈక్విటీ మూలధనాన్ని సేకరించే అద్భుత అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోందని మంత్రి తెలిపారు. సాధారణంగా చిన్న పరిశ్రమలకు వడ్డీ భారం పెద్ద సవాలుగా మారుతుందని… అయితే ‘NSE ఎమర్జ్’ ద్వారా కంపెనీలు రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ సేకరించవచ్చన్నారు. దీనివల్ల వడ్డీ లేని పెట్టుబడి లభించడమే కాకుండా, కంపెనీ ‘డెట్-ఈక్విటీ’ నిష్పత్తి మెరుగుపడి, భవిష్యత్తులో క్రెడిట్ రేటింగ్ పెరగడానికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవ్వడం ద్వారా సంస్థలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా “వేస్ట్-టు-వెల్త్” వంటి వినూత్న సాంకేతికతలతో పనిచేసే స్టార్టప్లకు, MSME పార్కులలోని యూనిట్లకు ఇది అద్భుతమైన వరం అని… ఇది కేవలం నిధులనే కాకుండా, పారదర్శకమైన యాజమాన్య పద్ధతులను, మెరుగైన బ్రాండ్ విలువను అందిస్తుందని మంత్రి చెప్పారు. ఈ విధానంలో మెయిన్ బోర్డ్ కంపెనీల్లాగా ప్రతి మూడు నెలలకు కాకుండా, ఆరు నెలలకు ఒకసారి ఆర్థిక నివేదికలు సమర్పించే వెసులుబాటు ఉంటుందని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News