-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్..త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్ష
-శస్త్ర చికిత్స జరిగిన ఈ పరిస్థితుల్లోనూ ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ముంబయిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కోలుకుంటున్న డిప్యూటీ సీఎంను మంత్రి దుర్గేష్ స్వయంగా కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వేగంగా కోలుకుంటున్నారని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు ఆయనకు ప్రస్తుతం తగిన విశ్రాంతి అవసరమని, ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ నిరంతరం ప్రజాసేవ గురించే తపించడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలకు నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన అందించిన దిశానిర్దేశం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన పార్టీ నిర్మాణంపై చూపిస్తున్న అంకితభావాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో మంత్రి దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ (ఏపీఎంఎస్ఐడీసీ), చిల్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు..
Prajavartha Online Telugu News