గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో చెత్త తరలింపు ఈ.ఆటోలు, చెత్త నుండి విద్యుత్ తయారి ప్లాంట్, సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లను యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు శనివారం నగరపాలక సంస్థ ఈ.ఈ. కొండారెడ్డితో కలిసి పరిశీలించారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ సూచించిన విధంగా యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృంద సభ్యులు 2 రోజుల పాటు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ మరియు అకౌంట్స్ విభాగ అధికారులకు వివిధ అంశాల పై వర్క్ షాప్ నిర్వహించి, శనివారం పలు ప్రాజెక్ట్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు బృంద సభ్యులు మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాల ను తరలించడానికి 220 ఈ ఆటోలకు మరియు 500 కిలో వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నగరపాలక సంస్థకు యునిడో రూ.10 కోట్లు గ్రాంట్ ఇవ్వనున్నదని, శనివారం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరియు ఈ. ఆటలను పరిశీలించామని తెలిపారు. అలాగే చెత్త నుండి విద్యుత్ తయారి చేసే జిందాల్ అర్బన్ వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను కూడా పరిశీలించామని తెలిపారు. సదరు ప్రాజెక్ట్ ల వలన రానున్న కాలంలో గుంటూరు నగరం స్వచ్చ నగరంగా, కాలుష్యరహిత నగరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో యునిడో ప్రాజెక్ట్ బృందం నుండి డాక్టర్ నందపాల్ సింగ్, మానస సురేష్, పి.వి.రమణారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News