గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇష్టానుసారంగా బ్యానర్లు కడుతున్నారని, అటువంటి సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భవనాల గోడల పై వాల్ పోస్టర్స్ అంటించే వారి పై కూడా చర్యలు తీసుకోవాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. రోడ్ల విస్తరణ పై సమీక్ష చేస్తూ ఇప్పటికే నందివెలుగు రోడ్, పెద్ద పలకలూరు రోడ్ల విస్తరణ పనులు పూర్తి అయ్యాయని, వెంటనే డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఆర్ & బి వారు రోడ్ నిర్మాణంకు చర్యలు తీసుకుంటారన్నారు. ఆయా రోడ్లలో విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ కు సదరు శాఖకు చెక్ లు ఇచ్చామని, వెంటనే షిఫ్టింగ్ పనులు కూడా చేపడతారన్నారు. కొత్తపేట శివాలయం రోడ్ కూడా విస్తరణ పనులు పూర్తి కావస్తున్నందున డ్రైన్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి సిద్దంగా ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు తెలిపారు. ఏ.టి. అగ్రహారం రోడ్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి వారం నిర్దేశిత లక్ష్యం పెట్టుకొని, విస్తరణ ప్రభావిత భవనాలకు నష్ట పరిహారం ఇవ్వడం, వాటిని తొలగించడం ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. రోడ్ల విస్తరణ పనుల్లో నష్ట పరిహారాలు, టి.డి.ఆర్.బాండ్ల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 పనులు చేపట్టడానికి ఆర్.డి.పి. తయారికి చర్యలు తీసుకోవాలని, ఏ.సి.పి.లు పనుల వేగవంతంకు మరింత శ్రద్ధ చూపాలన్నారు. పెండింగ్ లో ఉన్న మీడియా డివైస్ డిస్ప్లే ఫీజు వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి వారం సమీక్షలో ఫీజు చెల్లించిన వారి వివరాలు, బకాయిదార్ల హోర్డింగ్స్, బోర్డ్ల వివరాలు తమకు అందించాలని ఆదేశించారు. కోర్ట్ కేసులకు పక్కాగా కౌంటర్స్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అశోక్ కుమార్, అజయ్ కుమార్, టి.పి.ఎస్.లు, డి.ఈ.ఈ.లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News