Breaking News

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు తేవాలి

-పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు
-సివిల్ సప్లై శాఖపై సమీక్షలో సిఎం నారా చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫౌర సరఫరాల శాఖపై సిఎం నారా చంద్రబాబు నాయడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని సిఎం అన్నారు. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎం తేల్చి చెప్పారు. రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని..దీని వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సిఎం అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్ల పాలుచేశారని సిఎం అన్నారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా….5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ.41550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైశాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ లో కందిపప్పు ధర రూ.180 రూపాయలు ఉంటే….ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150లకు, బియ్యం కూడా కేజీ రూ.48లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సిఎం సూచించారు. గత తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, వాటిని మళ్లీ పునరుద్ధరించాలని అన్నారు. బియ్యం డోర్ డెలివరీ అంటూ చేపట్టిన విధానం కూడా లోపభూయిష్టంగా సాగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని….వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని అధికారులు సీఎంకు వివరించారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9260 వాహనాలు కొనుగోలు చేశారని…అయితే ఆ లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెప్పారు. ఈ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై పలు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సిఎం చంద్రబాబు సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *