Breaking News

ఏడు నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల

-ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం
-రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల
-శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్యకు పరిష్కారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు అందటం లేదు. 536 మంది కార్మికుల సమస్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే పరిష్కారం లభించింది. రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇందులో పని చేస్తున్న 536 మంది కార్మికుల ఏడు నెలల జీతాలు బకాయిలు చెల్లింపుపై పవన్ కళ్యాణ్ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు. బకాయిలకి సంబంధించి రూ.30 కోట్లు బడ్జెట్ రిలీజ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి బి.ఆర్.ఓ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు ఈ స్కీం ద్వారా తాగు నీరు అందుతోంది. ఈ స్కీం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే 536 మంది కార్మికులకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు నిలిచిపోయాయి. రూ.30 కోట్ల మేర పెండింగ్ వేతనాలు ఆగిపోయాయి. కార్మికులు విధులకి దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులను ఆరా తీశారు. ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడారు. రూ.30 కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్థిక, పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *