– ప్రాధాన్య రంగానికి రూ. 27 వేల కోట్ల రుణ ప్రతిపాదనలు.
– బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషిచేయాలి.
– బ్యాంకర్లు ముంపు ప్రభావిత ప్రజలకు అవసరమైన సేవలు అందించాలి.
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సంక్షేమం, ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని.. వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన బ్యాంకర్లను కోరారు.
శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన అధ్యక్షతన 9వ జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాలు జరిగాయి. సమావేశంలో తొలుత కలెక్టర్ సృజన.. ఎల్డీవో పీఎం పూర్ణిమ, సమావేశ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రీజనల్ హెడ్ ఎం.శ్రీధర్, ఎల్డీఎం కె.ప్రియాంకతో కలిసి 2024-25 ఆర్థిక సంవత్సర బ్యాంకింగ్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక కింద వ్యవసాయ రంగానికి రూ. 13,400 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 11,300 కోట్లు రుణ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. మొత్తం ప్రాధాన్యరంగానికి రూ. 27 వేల కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ. 46 వేల కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి రూ. 2,300 కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళిక లక్ష్యాల్లో ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు పురోగతిని చూస్తే ప్రాధాన్య రంగంలో 37.81 శాతం, ప్రాధాన్యేతర రంగంలో 50.47 శాతం, మొత్తం వార్షిక రుణ ప్రణాళికలో 45.79 శాతం మేర లక్ష్యాలను చేరుకున్నట్లు వివరించారు. పూర్తిస్థాయిలో రుణ లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు దిశగా ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రధానమంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (పీఎంఈజీపీ), స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, పీఎం స్వానిధి, ఆర్థిక అక్షరాస్యత, ఏపీటిడ్కో-పీఎంఏవై (యూ) తదితరాలపైనా సమావేశంలో చర్చించారు.
వరద ప్రభావిత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు కీలకం:
గతంలో ఎప్పుడూ లేనివిధంగా విజయవాడ అర్బన్తో పాటు పరిసర ప్రాంతంలో ముంపు నష్టం వాటిల్లిందని.. బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు వీలుగా వారికి బ్యాంకింగ్ సేవల ద్వారా ఆర్థిక చేయూతనివ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే బ్యాంకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా రీషెడ్యూలింగ్, కొత్త మూలధన రుణాల మంజూరు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని.. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రకృతి విపత్తు ప్రభావిత జిల్లాలో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాకింగ్ సేవలు అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News