– రోగుల నుంచి రుసుం వసూలు చేసినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవు
– మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు కృషిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథకాన్ని పటిష్టంగా అమలుచేయడంతో పాటు వైద్య సేవలపై రోగుల నుండి ఎలాంటి రుసుములు వసూలు చేసినా ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన స్పష్టం చేశారు.
డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథక సేవల అమలుపై శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పథకం అమలుతీరుపై సమీక్షించారు. జిల్లాలో డా. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం పరిధిలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిబంధనలు అతిక్రమించి, వసూళ్లకు పాల్పడిన కొన్ని ఆసుపత్రులకు కలెక్టర్ డా. జి.సృజన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ జరిమానాలు విధించడం జరిగింది. ఆసుపత్రుల వారీగా వచ్చిన ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, వాటిపై వివరణ తీసుకోవడంతో పాటు ఫిర్యాదుదారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అనంతరం నిబంధనల మేరకు జరిమానాలు విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించాలని లేని ఎడల చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు. రోగులకు సేవలందించే విషయంలో వైద్య మిత్రలు, టీం లీటర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డా. జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News