విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కనకదుర్గమ్మ వారధి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు గల జాతీయ రహదారిలో పారిశుధ్య నిర్వహణ మరియు గ్రీనరి పనులను గురువారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పరిశీలించారు. జాతీయ రహదారి వెంబడి పల్లంగా ఉన్న రోడ్ మర్జిన్స్ నందు వర్షపు నీరు నిలిచి యుండుట గమనించి అధికారులకు పలు సూచనలు చేసారు. భారతీనగర్ నోవేటెల్ హోటల్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రెయిన్ పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించుట గమనించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. అదే ప్రాంతములో జాతీయ రహదారి నందు వర్షపు నీటి నిల్వలు గమనించి పల్లంగా ఉన్న ఆ ప్రదేశంలో పిట్ ఏర్పటు చేసి దానిని సర్వీస్ రోడ్ నందలి డ్రెయిన్ కు అనుసంధానం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రహదారి వెంబడి రోడ్ మర్జిన్స్ నందు ఎటువంటి చెత్త లేదా వ్యర్ధము ఉండకుండా చూడాలని మరియు వర్షపునీరు ఎక్కడ నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు. సెంట్రల్ డివైడర్ నందలి గ్రీనరి పెంపొందించుటకు జరుగుతున్న మొక్కల ఏర్పాటు పనులను పరిశీలించి మొక్కలు నాటిన వెను వెంటనే మిగిలిన మట్టి మరియు వ్యర్ధములను తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచాలని ఉద్యానవన శాఖాధికారులకు సూచించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ. (వర్క్స్) వై.వి.కోటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.రంగారావు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News