గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం నుండి 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నామని, అందుకు తగిన విధంగా స్పెషల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజారోగ్య కార్మికులను ప్రాంతాలు, గృహాల వారీగా రేషనలైజేషన్, మ్యాపింగ్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, స్పెషల్ శానిటేషన్ పర్యవేక్షణ అధికారులు, ప్రజారోగ్య అధికారులతో 90 రోజుల స్పెషల్ డ్రైవ్ పై సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించడంలో రాజీ లేదని, ప్రస్తుత 90 రోజుల స్పెషల్ యాక్షన్ ప్లాన్ ద్వారా నగరంలో పారిశుధ్యంలో మార్పు కనిపించేలా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణకు, డ్రైన్ల శుభ్రానికి, రోడ్ల స్వీపింగ్ కు తగిన విధంగా వారీగా కార్మికులను, అందుకు అవసరమైన వాహనాలను మ్యాపింగ్ చేయాలన్నారు. 740 మైక్రో ప్యాకెట్స్ ల్లోని కార్మికులు, పుష్ కాట్ లు, ట్రాక్టర్లు, ఈ-ఆటోలతో ప్రత్యేక నగర స్వచ్చ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరూ నిర్దేశిత సమయంలో విధుల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కార్మికులు, మేస్త్రీలు, సూపర్వైజర్లు, కార్యదర్శులు అనధికార సెలవులు పెట్టకూడదన్నారు. స్పెషల్ అధికారులు తప్పనిసరిగా ఉదయం 5:30 గంటలకు కార్మికుల మస్టర్ సమయంలో పర్యవేక్షణ చేయాలని, తమకు కేటాయించిన ప్రాంతాల్లో సమగ్ర పారిశుధ్య పనులు జరిగేలా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు కేటాయించిన వాహనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా వెహికల్ షెడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, డ్రైవర్ల హాజరు ప్రతి రోజు పంపాలన్నారు. ప్రధాన రహదార్లను స్వీపింగ్ వాహనాల ద్వారా శుభ్రం చేయించాలన్నారు. నగరంలోని తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల వారీగా కమర్షియల్ వ్యర్ధాల సేకరణకు టెండర్లు పిలవాలని ఈఈ సుందర్రామి రెడ్డిని ఆదేశించారు. త్వరలో భవన నిర్మాణ వ్యర్ధాల సేకరణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎస్.ఈ. నాగ మల్లేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, బయాలజిస్ట్ మధుసూదన్, స్పెషల్ శానిటేషన్ పర్యవేక్షణ అధికారులు, ప్రజారోగ్య అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News