మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుకున్న దరఖాస్తులకు త్వరగా అనుమతులు మంజూరుచేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా అందులో 52 దరఖాస్తులకు అన్ని అనుమతులు వచ్చాయని వాటిని ఆమోదిస్తున్నామన్నారు. మిగిలిన 28 దరఖాస్తులకు సంబంధించి 6 ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, విద్యుత్ ఛార్జీ లు రాయితీ తిరిగి చెల్లింపు కింద 15 ఎం ఎస్ ఎం ఈల నుండి దరఖాస్తులు అందగా వాటన్నిటిని ఆమోదిస్తున్నామని, ఆ ప్రకారం వాటికి 54,24,852 రూపాయలు మంజూరుకు ఆమోదం తెలుపుతున్నామన్నారు. జిల్లాలో పీఎం విశ్వకర్మ పథకం కింద 37,573 దరఖాస్తులు అందగా 2,308 దరఖాస్తులను బ్యాంకులకు రుణాలు మంజూరుకు సిఫారసు చేసి పంపడం జరిగిందని మిగిలినవి వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని కూడా సత్వరమే పరిశీలించి బ్యాంకులకు పంపేందుకు సిద్ధం చేయాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఈ సంవత్సరం 56 దరఖాస్తులు లక్ష్యం కాగా 137 దరఖాస్తులను రుణాలు మంజూరు కోసం బ్యాంకులకు పంపడం జరిగిందని, అందులో 89 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు.
మల్లవల్లి పరిశ్రమల పార్కులో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటుకు సమావేశంలో తీర్మానం చేసి జిల్లా పోలీసు అధికారినిన్ లేఖ ద్వారా కోరాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, ఎల్ డి ఎం జయవర్ధన్, జాయింట్ రిజిస్ట్రార్ జగన్మోహన్, డిప్యూటీ చీఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, సి పి డి సి ఎల్ ఎస్ ఈ సత్యానందం, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ శ్రీనివాస్, ఎం వి ఐ శ్రీనివాస్, ఫ్యాప్సియా సభ్యులు జితేంద్ర, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News