– సమస్యకు మూలకారణాన్ని గుర్తించి, గడువులోగా పరిష్కరించండి
– శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారుల నియామకం
– ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థకు 97 అర్జీలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్య చిన్నదైనా.. పెద్దదైనా సమాన ప్రాధాన్యమిచ్చి గడువులోగా పరిష్కరించాలని, నాణ్యతలో రాజీపడొద్దని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమష్టిగా దృష్టిపెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు, అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించేవరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిచ్చేలా, అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్కు శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లు వివరించారు.రెవెన్యూ; సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించిన అర్జీలకు విజయవాడ, నందిగామ, తిరూవూరు ఆర్డీవోలకు ఆడిట్ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
48 రెవెన్యూ అర్జీలు:
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 97 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 48 అర్జీలు ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించి 12, పోలీస్ 6, పంచాయతీరాజ్కు సంబంధించి 4 అర్జీలు రాగా దేవాదాయ, విద్య, మైన్స్ అండ్ జియాలజీ శాఖలకు సంబంధించి మూడు చొప్పున, గృహ నిర్మాణం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, కాలేజీ విద్య, ఆర్ అండ్ బీ శాఖలకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. సహకార, మైనారిటీ సంక్షేమం, మార్కెటింగ్, ఆరోగ్యం, ఐసీడీఎస్, సర్వే అండ్ సెటిల్మెంట్, ఏపీ జెన్కో, ఏపీసీపీడీసీఎల్, పరిశ్రమలు, పొల్యూషన్ విభాగాలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. వీటిని నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News