Breaking News

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు… : ఎమ్మెల్యే  మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చలనచిత్ర రంగంలో విలక్షణమైన నటనకు ఎస్వీ రంగారావు గారే స్ఫూర్తి అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. ఎస్వీ రంగారావు  47వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమలో ఎస్వీ రంగారావు  వంటి మహానటులు మరలా రాబోరన్నారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం ఇలా ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల మేటి నటులు ఎస్వీ రంగారావు అని కీర్తించారు. ఆయన నటనకు పాత్రలే పరివశించిపోయేవన్నారు. ఘటోత్కచుడు, దుర్యోధనుడు, రావణ బ్రహ్మ పాత్రలను ఆయనంత ఎనర్జిటిక్ గా పోషించగల నటుడు మరొకరు పుట్టలేదని, ఆయన చేసిన ఎన్నో పౌరాణిక పాత్రలే ఇందుకు నిదర్శనమన్నారు. డైలాగ్ డెలివరీలో ఆయన బాణీ అనితరసాధ్యమని కొనియాడారు. తన సుదీర్ఘ నట ప్రయాణంలో ఎస్వీ రంగారావు పోషించిన ప్రతి పాత్ర ఓ కళాత్మక మజిలీ అని పేర్కొన్నారు. అటువంటి గొప్ప నటుడు కృష్ణాజిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమని  మల్లాది విష్ణు  అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నటించిన సినిమాల రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎస్వీఆర్ వంటి మహనీయునికి ఘన నివాళులర్పిస్తూ కళామంజరి సాంస్కృతిక సేవాసంస్థ మరియు ఆంధ్రరాష్ట్ర అకాడమీ ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన నిర్వహించడమే కాకుండా పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ కి స్వర్ణకంకణం బహుకరించడం అభినందనీయమని మల్లాది విష్ణు  అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అడపా శేషు, రాజనాల బాబ్జి, వేముల అదిరత్తయ్య గుప్తా, పీవీఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *