Breaking News

సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే విజయవాడ నగరానికి పూర్వవైభవం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో రూ. 4.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర ప్రగతిపై  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు వెళుతున్నట్లు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. నియోజకవర్గంలో రూ. 4.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ  కరీమున్నీసా తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. 32వ డివిజన్ లోటస్ సెక్టార్ 1 & 2 ప్రాంతాలలో రూ. 50 లక్షల వ్యయంతో క్రాస్ రోడ్లు, సెక్టార్ -1 (రోడ్ నెం.3,4 & 5) లో రూ. కోటి 7 లక్షల వ్యయంతో డ్రెయిన్‌ల నిర్మాణం మరియు బిటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరానికి పూర్వవైభవం వచ్చిందన్నారు. నగర ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లు, త్రాగునీరుతోపాటు నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కృష్ణా నదీ తీరాన ఉంటూ విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ఏనాడూ రూ. 100 కోట్లు కూడా కేటాయించలేదని.. కనీసం తట్టమట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి  హయాంలో దాదాపు రూ. 600 కోట్ల విలువైన పనులు నగరంలో చేపట్టడం జరిగిందన్నారు.

ఆస్తి పన్నుపై అపోహలు వద్దు…
చంద్రబాబు అవకాశవాది అని.. తమ రాజకీయ లబ్ధి కోసం పన్నుల విధానంపై ప్రజలలో విషబీజాలు నాటుతున్నారని మండిపడ్డారు. జీవో నెం. 198 పట్ల అవగాహన రాహిత్యంతో ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పన్నుల విధానంపై దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించి అక్కడి విధివిధానాలను అధికారులు అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలో పన్నుల శాతం చాలా తక్కువ అని పేర్కొన్నారు. ఆస్తిపన్ను భారం సామాన్య, మధ్య తరగతి వర్గాలపై ఉండబోదని స్పష్టం చేశారు. త్వరలోనే కౌన్సిల్ సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రతిపక్షాల నోర్లు మూయిస్తామన్నారు.

ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ దిశ‌గా అడుగులు…
రాష్ట్రాన్ని ఆరోగ్యాంద్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. అయోధ్యానగర్‌లో రూ. 80 లక్షల వ్యయంతో పట్టణ ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజల అవసరాలను, ఇబ్బందులను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, అయోధ్యనగర్, గుణదల ప్రాంతాలలో 4 ఆరోగ్య కేంద్రాలను ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలకు ఉచితంగా ప్రాథమిక వైద్యం అందుతుందనే భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, డివిజన్ ప్రెసిడెంట్ జి.వెంకటేశ్వరరెడ్డి, గవాస్కర్, ఆత్మకూరు సుబ్బారావు, అంగిరేకుల నాగేశ్వరరావు, లోటస్ సెక్టార్-1 ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సువర్ణరాజు, జి.శ్యాం, కొండపల్లి మురళి, నాడార్స్ శ్రీను, త్రివేణి, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అన్ని డివిజన్ల సమగ్రాభివృధ్ధే ధ్యేయం…
గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన నగర ప్రగతి పట్ల జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతోందని మల్లాది విష్ణు  అన్నారు. 29వ డివిజన్‌ మధురానగర్ కొబ్బరితోట నుండి శివాలయం వంతెన వరకు రూ. 1 కోటి 15 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ  కరీమున్నీసా గారితో కలిసి ఆయన శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో నగరంలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న డివిజన్ లలోనూ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి,  ఉద్ధంటి సునీత, స్థానిక నాయకులు ఎస్.కె.బాబు, కొండలరావు, జయకృష్ణ ప్రసాద్, అంబటి రంగయ్య, గోవింద్, పిల్లి మురళి, కోటేశ్వరరావు, కోలా రమేష్, పూర్ణిమ, నాగమణి, నాగప్రియ, దుర్గాంబ, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *