– దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్
– రేషన్ దుకాణాల ద్వారా అత్యంత పారదర్శకంగా సరుకుల పంపిణీ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని.. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడి వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, పంపిణీలో డీలర్లు అత్యంత పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీపై గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పౌర సరఫరాల అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లు, డీలర్ల అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయిలో మాసాంతానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రేషన్ దుకాణాల ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థపై కార్డుదారులకు అవగాహన కల్పించాలన్నారు. రేషన్ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సేవలందించేలా చూడాలన్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని,ఇందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరైన విధంగా స్టాక్ను నిర్వహించడం, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయడం, కార్డుదారునికి ఈ-పోస్ రిసీట్ అందించడం వంటివి చేయాలన్నారు. ధరలు, స్టాక్ బోర్డులను సరైన విధంగా ఏర్పాటుచేయాలన్నారు. ఏదైనా సాంకేతిక సహకారం కావాలంటే టీమ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ-పోస్, వెయింగ్ మెషీన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల విషయంలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చర్యలు తీసుకుంటోందని, నేరుగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని, ఎప్పటికప్పుడు విశ్లేషించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో నిబద్ధతతో రేషన్ దుకాణాలు కార్డుదారులకు సేవలందించాలని, లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా సరుకులు పంపిణీ విధానాన్ని అమలుచేయాలని సూచించారు. ఏపీఎస్టీపీడీఎస్ (నియంత్రణ) ఆర్డర్, 2018 ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
సమావేశంలో డీఎస్వో ఎ.పాపారావు, ఏఎస్వోలు చల్లా లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్.లక్ష్మణబాబు, డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎం.వెంకటరావు, జిల్లా ప్రెసిడెంట్ యు.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్, జిల్లా ట్రెజరర్ ఎం.భూషణం, పౌర సరఫరాల డీటీలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News