– అన్నదాతల జీవన ప్రమాణాల మెరుగు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల, పూల మొక్కల సాగును చేపట్టవచ్చని, ఉద్యాన పంటలతో రైతులకు సుస్థిర ఆదాయాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
చందర్లపాడు మండలం, ముప్పాళ్ల గ్రామ రైతు నాగేశ్వరరావు ఉపాధి హామీ పథకం కింద ఎకరా విస్తీర్ణంలో వేసిన తైవాన్ జామ తోటను కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి సందర్శించారు. మొత్తం 444 మొక్కలు వేయగా.. పథకం కింద మొదటి ఏడాది రూ. 1,26,110, రెండో ఏడాది రూ. 60,707, మూడో ఏడాది రూ. 64,407 మొత్తం రూ. 2.51 లక్షల సాయం అందుతుంది. గుంతలు తవ్వేందుకు మార్కింగ్ చేసింది మొదలు.. మొక్కల కొనుగోలుకు, రవాణాకు, నాటడానికి, సంరక్షణకు ఇలా వివిధ పనులకు ఆర్థిక సహాయం అందుతుంది. ఉపాధి పథకం ద్వారా ఈ పంట వేసినందుకు చాలా ఆనందంగా ఉందని.. రెండో ఏడాది నుంచి ఆదాయం రావడం మొదలవుతుందని, ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రైతుల క్షేమం, సంక్షేమానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని.. స్వర్ణాంధ్ర సాధనకు వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏలో ప్రగతి కీలకమని, ఈ నేపథ్యంలో ఉద్యాన పంటలతో పాటు పశు పోషణను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా దాదాపు లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందన్నారు. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. పొలం పిలుస్తోంది కార్యక్రమాల ద్వారా సలహాలు సూచనలు అందించడంతో పాటు అన్ని విధాలా చేయిపట్టి నడిపించడం జరుగుతోందన్నారు. అగ్రీ టెక్పైనా అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News