మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైతుల అవసరాన్ని బట్టి యూరియా పంపిణీ చేస్తామని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో పర్యటించి యూరియా స్థితిగతులపై ఆరా తీశారు.
తొలుత గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లో మన గ్రోమోర్ కేంద్రం కోరమాండల్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
యూరియా డిమాండ్ ఎలా ఉంది, తగ్గిందా అని కలెక్టర్ అడుగగా కేంద్రం నిర్వాహకులు డిమాండ్ కాస్త తగ్గిందని, ప్రస్తుతం 258 బస్తాల యూరియా నిల్వ ఉందని, రైతులు రెండు డోసుల యూరియా వాడకం పూర్తి చేశారని, మూడో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంకా యూరియా కావాల్సి ఉందన్నారు. యూరియా వాడకం మరో 10 రోజుల్లో అవసరం ఉందన్నారు.
వీఆర్వో మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి తిరిగి యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అవగాహన కల్పించామన్నారు. ఇంకా 15 టన్నుల యూరియా అవసరం ఉందని, సరఫరా చేస్తే జాగ్రత్తగా పంపిణీ చేస్తామన్నారు.
అక్కడే కొందరు రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ కౌలు రైతులు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా కలుపుకొని వాడుతున్నారని దీంతో 3 కట్టల యూరియా అవసరం ఉంటుందని, యూరియా దొరుకుతుందో దొరకదు అనే ఆందోళనతో రైతులు ఉన్నారన్నారు.
దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని, జిల్లాకు మరలా యూరియా వస్తుందన, రైతులకు కావలసినంత పంపిణీ చేస్తామని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నందివాడ మండలం పుట్టగుంట గ్రామ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
యూరియా అవసరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము కొందరము రెండవ డోసు యూరియా వేసుకున్నామని, మరికొందరు మూడో డోసు కూడా యూరియా వేసుకున్నామన్నారు. యూరియాకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని వారు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి యూరియా సమస్యలను అడిగి తెలుసుకోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News