గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, నాణ్యత లేకుంటే బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతోపాటు, పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ పట్టాభిపురం, స్తంభాల గరువు, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు ప్రమాణాలు పాటిస్తూ చేపట్టాలని, పనులను ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే ఎమినిటి కార్యదర్శి, ఏఈలే భాద్యత వహించాలన్నారు. ఏఈల వారీగా టెండర్ పొంది పనులు ప్రారంభించని వాటి వివరాలు ఇవ్వాలని, వాటికి సంబందించిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి, రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సిసి డ్రైన్, రోడ్లను క్యూరింగ్ సక్రమంగా చేయాలన్నారు. అనంతరం లక్ష్మీపురంలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాన్ని పరిశీలించి, కొలతలు తనిఖీ చేసి, నిర్దేశిత ప్లాన్ మేరకు నిర్మాణాలు చేయాలని, ర్యాంప్ లు రోడ్ల మీదకు రాకుండా చూడాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. నిర్మాణ అనంతరం కాకుండా నిర్మాణ సమయాల్లోనే పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు నిర్మాణాలు ప్లాన్ మేరకు చేస్తున్నారా లేదా అని తనిఖీలు చేయాలన్నారు.
పర్యటనలో ఏసిపి రెహ్మాన్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News