కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు APSRTC బస్స్టాండ్ సెంటర్ నుంచి నగర వీధుల గుండా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి వరకు ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శాసన సభ్యులు స్వయంగా ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం అనివార్యమని తెలిపారు. వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, చిన్న పిల్లలకు భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు కె.వి.వై.ఎస్. ప్రసాద్, సి.హెచ్. సంపత్ కుమార్, ఎం. రవి కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. లక్ష్మీ ప్రవీణ, స్థానిక డీఎస్పీ జీ. దేవకుమార్, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం, ఎస్ఐ అలెగ్జాండర్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు కాంతామణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.
Prajavartha Online Telugu News