తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ముందుగా అభినందిస్తున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి ఆర్థిక లోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించి, 2026–27లో దాన్ని 4.3 శాతానికి పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయం. మూలధన వ్యయానికి 2026–27లో రూ.12.21 లక్షల కోట్లను కేటాయించడం అభివృద్ధికి దోహదపడే చర్యగా భావిస్తున్నాను; ఖర్చులు పెంచినా ఆర్థిక లోటుపై నియంత్రణ కొనసాగించడం అభినందనీయం.
అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎంఎన్ఆర్ఈజీఏ, జల్ జీవన్ మిషన్, ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల కేటాయింపులు గణనీయంగా తగ్గడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎంఎన్ఆర్ఈజీఏకు 2025–26లో ఖర్చవుతుందని అంచనా వేసిన రూ.88 వేల కోట్లను 2026–27లో కేవలం రూ.30 వేల కోట్లకు తగ్గించడం ద్వారా రాష్ట్రాలపై భారాన్ని మోపినట్లైంది. జల్ జీవన్ మిషన్కు 2025–26లో బడ్జెట్ చేసిన రూ.67 వేల కోట్లలో వాస్తవంగా ఖర్చయ్యే అంచనా రూ.17 వేల కోట్లకే పరిమితం కావడం, పీఎంజీఎస్వై కేటాయింపులు కూడా తగ్గడం వల్ల గ్రామీణ ఉపాధి, మౌలిక వసతులు దెబ్బతినే ప్రమాదం ఉంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి 41.15 మీటర్ల ఎంఢిడిఎల్ వరకు పూర్తి చేయడానికి 2026–27లో రూ.3,320.39 కోట్లను కేటాయించినప్పటికీ, మొత్తం సవరించిన వ్యయం రూ.30,436.95 కోట్లుగా ఉండగా కేంద్ర గ్రాంటును రూ.12,157.53 కోట్లకే పరిమితం చేయడం రాష్ట్రంపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది.
దేశవ్యాప్తంగా అప్పు–జీడీపీ నిష్పత్తిని 2030–31 నాటికి 50 శాతానికి తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పాలనలో అప్పులు విపరీతంగా పెరిగి తరతరాలపై భారంగా మారుతున్నాయి. ఏపీఎండీసీ, ఏపీఎస్బీసీఎల్ ద్వారా జరుగుతున్న ఆఫ్ బడ్జెట్ అప్పులు కాగ్ అభిప్రాయాలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి.
భవిష్యత్తులో రాష్ట్ర అప్పు పరిమితులు తగ్గకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై కఠినంగా పర్యవేక్షణ చేయాలని కోరుతున్నాను. గతంలో అధిక అప్పుల కారణంగా రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా స్పష్టమైన, దృఢమైన చర్యలు అవసరం అని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
Prajavartha Online Telugu News