– పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో రాజీలేదు
– విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని.. పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చిన్నారులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి సందర్శనల్లో భాగంగా శుక్రవారం నందిగామలోని డీవీఆర్ కాలనీ ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో ముచ్చటించి విద్యా నైపుణ్యాలను పరీక్షించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ విధానాలపై సమగ్రంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం పోషక విలువలతో కూడి, ప్రభుత్వ నిర్దేశించిన మెనూ ప్రకారం ఉందో లేదో చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులకు అందిస్తున్న భోజనం రుచి, నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని.. ఈ పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతం, విద్యా పురోగతిపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులు అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని, తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించబోమని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
Prajavartha Online Telugu News