గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి కుక్కలకు ఏబీసి, ఏఆర్వీలు వేగంగా జరుగుతున్నాయని, రోజువారీ చేసే ఏబీసిల సంఖ్య పెంచేందుకు అవసరమైన అదనపు సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఎంహెచ్, విఏఎస్, స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో ఏబీసి వేగవంతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధి కుక్కల దాడులపై ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పొన్నూరు రోడ్ లోని ఏబీసి సెంటర్లో ఆపరేషన్ల సంఖ్య పెంచడానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ధియేటర్ల సంఖ్య, సదుపాయాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏబీసి సెంటర్ ని పరిశుభ్రంగా ఉంచాలని, ఏబీసి చేసిన వీధి కుక్కలకు నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఆహారం అందించాలన్నారు. ఆపరేషన్ నుండి కోలుకున్న వాటిని పట్టుకున్న ప్రాంతంలోనే వదలాలన్నారు. ఏబీసి సమర్దవంతంగా జరిగేలా విఏఎస్ భాధ్యత తీసుకోవాలని, ఏ సమస్య ఉన్నా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ భారత్, వారి డాక్టర్ల బృందం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News