గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నీరు ప్రాణకోటికి జీవనాధారమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర –స్వచ్చాంధ్రలో “జలధార- జలహారతి” థీమ్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ అవగాహన ర్యాలీ, నీటి సంరక్షణ చర్యలు పరిశీలన, మొక్కలు నాటి, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల 3 వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్చత ప్రాధాన్యతగా స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర చేపడుతూ, స్వయంగా ముఖ్యమంత్రే పాల్గోనడడం ద్వారా స్వచ్చతకు ఉన్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నారన్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అవసరాలు మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురవుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు తెలిపారు. ఈ పవిత్ర ఆశయంతో ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా నగర పరిధిలోని అన్ని చెరువులు, కాలువలు మరియు నీటి వనరులను పునరుద్ధరించడమే కాకుండా, వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించి భవిష్యత్ అవసరాల కోసం రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ఈ 100 రోజుల కాలంలో ‘అమృత్’ పథకం మరియు జిఎంసి సాధారణ నిధులతో చెరువుల ఇన్లెట్స్ మరియు ఛానల్స్ క్లీనింగ్ వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇళ్లలో నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో నగరాన్ని నీటి కొరత లేని స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ కన్నసాని బాజీ, సెక్రెటరీ బి.శివరామకృష్ణారెడ్డి, కమిటి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News