అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజానికి చేటు చేకూర్చే గంజాయి,డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను ఉక్కు పాదంతో అణచి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(NCORD)2026 ఏడాదికి మొదటి త్రైమాసిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్నగంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.గంజాయి,డ్రగ్స్ ఒక శాఖో రెండు శాఖలకో సంబంధించిన సమస్య కాదని ఇదొక సామాజిక సమస్య అని కావున వీటి నియంత్రణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించ గలిగితేనే వీటిని పూర్తి స్థాయిలో నివారించ గలుగుతామని అన్నారు.అందువల్ల అన్ని శాఖలు ఈవిషయంలో మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.వీటి బారి నుండి సమాజాన్ని మన పిల్లలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.గంజాయి సాగు,రవాణా నియంత్రణపై సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఒడిస్సా సిఎస్ కు డిఓ లేఖ వ్రాయనున్నట్టు సిఎస్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
డాక్టర్ ప్రిస్కిప్సన్ లేకుండా వివిధ మత్తు పదార్ధాలు(డ్రగ్స్)అమ్మాకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి హోల్ సేల్ డీలర్లు వివిధ డ్రగ్స్ ను ఎంత మొత్తంలో కొనుగోలు చేసి రిటైల్ అమ్మకాలు చేస్తున్న వివరాలను డ్రగ్స్ రకం,బ్యాచ్ తదితర వివరాలను ముందుగానే ఆన్లైన్ ద్వారా ఈగల్ కార్యాలయానికి తెలియజేసేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.ఆవిధంగా చేయడం వల్ల ఎన్డిఎంఏ,కొకైన్ వంటి డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రణ చేయవచ్చని సిఎస్ పేర్కొన్నారు.
గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్దాల సేవనంతో కలిగే అనర్దాలపై ప్రజల్లో ముఖ్యంగా యువత,విద్యార్దుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అవగాహనా కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ఈగల్ చీఫ్ రవికృష్ణను సిఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు.పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకూ విద్యార్ధుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు కృషి జరుగుతోందని అన్నారు. ఎక్సైజ్ శాఖ వద్ద 200 వరకూ ఎన్డిపిఎస్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆశాఖ అధికారులను సిఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు.
ఈసమావేశంలో ఈగల్(Elite Anti Narcotics Group for Law Enforcement) చీఫ్ ఐజి ఎ.రవికృష్ణ ఈగల్ ఆపరేషన్లకు సంబంధించిన ప్రగతిని వివరిస్తూ ఇప్పటి వరకు 54వేల 416 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2153 కేసులు రిజిష్టర్ చేసి 5548 మంది నిందుతులను అరెస్టు చేసి 917 వాహనాలను స్వాధీన పరుచుకున్నట్టు వివరించారు.అలాగే ఇతర డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.ఆపరేషన్ వజ్రప్రహార్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున గంజాయి,గంజాయి చాక్లెట్లు వంటివి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు.అల్లూరి సీతారామ రాజు జిల్లాలో గంజాయి జీరో కల్టివేషన్ కు ఆపరేషన్ చైతన్యం పేరుతో డ్రోన్స్ సర్వేలెన్స్ చేపట్టి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని లక్షా 66వేల కిలోల గంజాయిని నాశనం చేయడం జరిగిందన్నారు.ఆయా గిరిజనులకు ప్రత్యామ్నయ పంటల సాగుకు పండ్ల మొక్కలను అందించడం జరిగిందని తెలిపారు.
త్వరలో ముఖ్యమంత్రి వర్యుల చేతులమీదగా ఈగల్ వెబ్ సైట్ ను ప్రారంభింప చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఐజి రవికృష్ణ పేర్కొన్నారు.1972 టోల్ ఫ్రీ హెల్పలైన్ మరియు రిహాబిలిటేషన్ ఇకోసిస్టమ్ కు 2024 నవంబరు నుండి మార్చి వరకూ 16వేల 78 కాల్స్ వచ్చాయని వాటిలో 863 ఎన్డిపిఎస్ సంబంధిత అంశాలకు చెందినవి కాగా వాటిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి 6 నుండి 12వ తరగతి వరకు గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనంతో కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంన్నట్టు తెలిపారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రగ్స్ వద్దు బ్రో పేరిట యువత,విద్యార్ధుల్లో పెద్దఎత్తన అవగాహన కల్గించడం జరుగుతోందని వివరించారు.ఇంకా ఈగల్ కార్యకలాపాలకు సంబంధించిన పలు కార్యక్రమాలు సాధించిన ప్రగతి తదితర వివరాలను ఐజి రవికృష్ణ వివరించారు.
ఈసమావేశంలో విజయవాడ డిఆర్ఐ డిడి సాహస్ సౌర్య,ఆర్పిఎఫ్ ఎస్డిఎస్సి షణ్ముఖ వడివేల్,విశాఖపట్నం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ ఫంకజ్ ద్వివేది పాల్గొనగా వర్చువల్ గా డిజిపి హరీశ్ కుమార్ గుప్త,వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్,విశాఖపట్నం ఐజి గోపీనాధ్ జెట్టి,పలువురు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News