-అపోహలు నమ్మవద్దు – అవసరానికి మించి కొనొద్దు
-డిమాండ్ కు తగ్గట్లు సరఫరాకు ప్రభుత్వం చర్యలు
-రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యం
– బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ఇంధనానికి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని.. అపోహలు నమ్మవద్దని, ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయవద్దు అని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. జిల్లాలో రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఇంధన విక్రయ కేంద్రాల్లో తగిన స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోమవారం అన్ని బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సగటున 3,81,000 లీటర్ల పెట్రోల్, 5,07,000 లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని..
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, అదనంగా 10 శాతం ఇంధనాన్ని సరఫరాకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి స్వయంగా సరఫరాదారులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ఇంధన కొరత వస్తుందేమోననే అపోహలతో కొంతమంది వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్ సూచించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల రోజువారీ అవసరాలకు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లోని ఇంధన విక్రయ కేంద్రాలకు సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. పంట కోతల కార్యకలాపాలు, ఆక్వా రంగంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారుల బృందాల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని తెలిపారు. ఎవరైనా ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో 91549 70454 నెంబర్ తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని ఎవరైనా ఈ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు లేదా విజ్ఞప్తులు తెలియ చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News