-రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యం
-ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ
-ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన
-పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల అమలులో లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ
-విద్యుత్ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం, జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతి రోజూ 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6397 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించు కున్నామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సుమారు 14 శాతం మేర విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగం పెరగడానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు వివరించారు. వచ్చే ఆరు నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఏప్రిల్ 2025లో విద్యుత్ కొనుగోలు ధర రూ. 5.20 ఉండగా.. మార్చి 2026 నాటికి రూ. 4.90కు తగ్గించామని అధికారులు చెప్పారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పునరుత్పాదక విద్యుత్ పై దృష్టి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గాలి. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అలాంటి చర్యలన్నింటి పైనా అధికారులు దృష్టి పెట్టాలి. విద్యుత్ రంగంలో ఏయే దేశాల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలు అవుతున్నాయో అధ్యయనం చేయాలి. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 4.60కు తగ్గించాలి. ఈ దిశగా విద్యుత్ శాఖాధికారులు దృష్టి సారించాలి. విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలో నైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నాం. ప్రజలకు మేలు చేయాలంటే టెక్నాలజీ వినియోగం అత్యంత అవసరం. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ నిరంతరం గుర్తు చేసుకోవాలి. విద్యుత్ లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ కు పెద్ద పీట వేయాలి. దీని కోసం ట్రాన్స్ కో, జెన్కో వంటి సంస్థలు తమకున్న సీఎస్సార్ నిధులు కేటాయించాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటాం. పంప్డ్ స్టోరేజీ విధానంలో విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎనర్జీ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ తగ్గేలా… పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలి. 2028-29 నాటికి సగాని పైగా విద్యుత్ ఉత్పత్తి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చేలా చూడాలి. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 52396 సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు ఇచ్చాం. దీన్ని మరింత వేగంవంతం చేయాలి. ఇకపై ప్రతి నెల 2 లక్షల పీఎం సూర్య ఘర్ కనెక్షన్లు ఇచ్చేలా చూడాలి. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చాం. మొదటి విడత పీఎం కుసుమ్ పథకాన్ని డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఇక ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం, కొనుగోళ్లపై పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్, ట్రాన్సుకో, జెన్కో, వివిధ డిస్కంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News