గుంటూరు, నేటి పత్రిక ప్రజలు :
బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులను పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు విస్తరణ పనులను వేగంగా రోజు వారీ కార్యాచరణ సిద్దం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 60 అడుగుల రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరణ చేస్తున్నందున పనులు జరిగే సమయంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామాగ్రి రోడ్ల మీద లేకుండా అంతర్గత రోడ్లలో పెట్టుకోవాలన్నారు. రోడ్డు విస్తరణ చేయు సమయంలో ప్రభావిత భవన యజమానుల నుండి అంగీకార పత్రాలను తీసుకోవాలన్నారు. రోడ్డు విస్తరణకు పెండింగ్ ఉన్న ప్రాంతాన్ని 4 రోజుల్లో మార్కింగ్ చేసి, సదరు ప్రాంతాన్ని క్లియర్ చేసి, ఇంజనీరింగ్ అధికారులకు అందజేయాలన్నారు. అలాగే ఇంజనీరింగ్ అధికారులు 15 రోజుల్లోగా సదరు ప్రాంతంలో డ్రైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణకు సంబంధించి కోర్ట్ కేసులు ఉన్న వాటి వివరాలు అడిగి తెలుసుకొని, కేసులు ఉన్న వాటికి న్యాయ పరమైన సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, డి.సి.పి సూరజ్ కుమార్, ఏ.సి.పి రెహమాన్, ఈఈ (ఇంచార్జి) కళ్యాణ్ రావు, పట్టణ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News