అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో 2026 మే 2న హీట్ వేవ్/ వడదెబ్బ/ వడగాడ్పుల నివారణ చర్యలపై అవగాహన & సామర్థ్య పెంపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. APCRDA అధికారులు, OHS మేనేజర్లు, పర్యావరణ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్(PMCs), కాంట్రాక్టర్లు, అలాగే PgMC, APCRDA, ADCL సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా వచ్చే ప్రమాదాలపై అవగాహన పెంచడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం & అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడం.
హీట్ వేవ్, హీట్ స్ట్రెస్ గురించి ఈ కార్యక్రమంలో నిపుణులతో అవగాహన కల్పించడం జరిగింది. వడదెబ్బ తగిలినప్పుడు కలిగే అనారోగ్య లక్షణాలను ముందుగానే గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్, అత్యవసర చికిత్స పద్ధతులను సైతం నిపుణులు వివరించారు.
కార్యక్రమాన్ని APCRDA ESMU విభాగ అధికారి అనిత భూపతి, PgMC నుంచి డాక్టర్ సూర్యనారాయణ ప్రారంభించారు. రాజధానిలోని అన్ని ప్రాజెక్టు ప్రాంతాల్లో హీట్ వేవ్ నివారణ చర్యలను కచ్చితంగా అమలు చేయాలని వారు కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రధాన సెషన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి(GGH)కు చెందిన డాక్టర్ ప్రభు నిర్వహించారు. ఆయన హీట్ స్ట్రెస్, దాని ప్రభావాలు, వడగాలులు, ఉష్ణోగ్రత కారణంగా వచ్చే వివిధ రకాల అనారోగ్యాలు, ప్రారంభ లక్షణాలు, ఫస్ట్ ఎయిడ్, అత్యవసర చికిత్స విధానాలపై హాజరైనవారికి వివరించారు. వడదెబ్బ తగిలినప్పుడు శరీరాన్ని చల్లబరచే విధానాలు, సమయానికి వైద్య చికిత్స పొందడం ఎంత ముఖ్యమోనన్న అంశాలను వివరించారు. ఈ సెషన్కు APCRDA OHS విభాగానికి చెందిన పాల్ సుధాకర్, వి. ప్రదీప్, బి. శ్రీధర్ & PgMC నుంచి మోహనరావు సహకారం అందించారు. సెషన్ నిర్వహించిన డాక్టర్ ప్రభును APCRDA అధికారులు సత్కరించారు.
ఈ శిక్షణలో హీట్ స్ట్రెస్ అవగాహన, ఫస్ట్ ఎయిడ్, తగినంత నీరు తాగడం, పని-విశ్రాంతి సమయాల నిర్వహణ, పనిని సురక్షితంగా ప్లాన్ చేయడం, రక్షణ పరికరాల వినియోగం, కార్మికుల రక్షణ, సైట్ స్థాయిలో పర్యవేక్షణ & నివేదిక వ్యవస్థల బలోపేతం వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని డా. గంగాధరి సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు. చివరలో చర్చా కార్యక్రమం & అభిప్రాయాల సేకరణతో కార్యక్రమం ముగిసింది.
Prajavartha Online Telugu News