– పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది అత్యంత విలువైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా వెలిబుచ్చే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని అన్నారు. సమాజంలోని అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించే పాత్రికేయుల సేవలు అపారమని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సమాచార యుగంలో వేగం పెరిగినప్పటికీ, నిజ నిర్ధారణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన జర్నలిజం అత్యవసరమని మంత్రి అన్నారు. అసత్య ప్రచారం, వదంతులు సమాజానికి హానికరమని హెచ్చరిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మీడియా ప్రధాన కర్తవ్యమని సూచించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పాత్రికేయులు భయభ్రాంతులు లేకుండా తమ వృత్తి నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. పత్రికా రంగం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సత్యనిష్ఠతో, ధైర్యంతో పనిచేస్తున్న పాత్రికేయులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ హితానికి మీడియా మరింత బాధ్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News