గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి పాల్గొనే చిన్నపలకలూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమ విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ నెల 13న చిన్నపలకలూరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లు శంఖుస్థాపన చేయనున్న నేపధ్యంలో శంఖుస్థాపన, సభావేదిక ప్రాంతాన్ని పరిశీలించి, అనంతరం రైల్వే, జిఎంసి, ఫైర్, పోలీస్, రెవెన్యూ, డిఆర్డీఏ, హౌసింగ్ అధికారులతో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిలాఫలకం, సభావేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు భాధ్యత తీసుకొని నిర్దేశిత ప్రొటోకాల్ మార్గదర్శకాల మేరకు సిద్దం చేయాలన్నారు. కేంద్ర మంత్రి పర్యటన మార్గం, సభావేదిక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని జిఎంసి డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికాబద్దంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను, సభకు హాజరయ్యే వారికి మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేయాలని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పెద్ద పలకలూరు మెయిన్ రోడ్ లోని ప్యాచ్ వర్క్ లను, డివైడర్లకు పెయింటింగ్ లను తక్షణం చేపట్టాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు విధులు కేటాయించబడిన ప్రతి అధికారి తమ సిబ్బందితో కార్యక్రమం పూర్తీ అయ్యే వరకు భాధ్యతగా ఉండాలని, ఏ విధమైన లోపాలు తలెత్తడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఆయా విభాగాల అధికారులు ముందుగానే కార్యకమ ప్రదేశానికి వెళ్లి పరిశీలించుకోవాలన్నారు.
సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి ఓఎస్డీ రూప్ కుమార్, రైల్వే డిప్యూటీ సిఈ నాయుడు, జిఎంసి డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News