విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్ పర్సన్ నెట్టెం రఘురామ్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల ఘనంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకుల ఆధ్వర్యంలో, జీఎం రంగబాబు పర్యవేక్షణలో స్థానిక బ్రాంచ్ చీఫ్ మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, పెద్దాపురం ప్రాంతాల్లో, మైలవరం నియోజకవర్గంలోని మైలవరం టౌన్ తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మరియు విసన్నపేట ప్రాంతాల్లో చలివేంద్ర స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని మజ్జిగ, తాగునీరు అందించారు.
ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేడీసీసీ బ్యాంక్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు హర్షాతిరేకాలతో అభినందించారు. మండుటెండల్లో ప్రజలకు అండగా నిలుస్తూ మానవతా దృక్పథంతో బ్యాంక్ నిర్వహిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు కొనియాడారు.
చైర్మన్ నెట్టెం రఘురామ్ నిరంతర సహకారం, ప్రోత్సాహంతో ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధికారులు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా కేడీసీసీ బ్యాంక్ ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలిచే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News