– స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమే ప్రభుత్వ లక్ష్యం
– ఏపీలో ఎంఎస్ఎంఈలకు అనుకూల వాతావరణం
– ఎస్ఐసిసిఐ 116వ వార్షిక సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంఎస్ఎంఈల పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యమవుతాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం దక్షిణ భారత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SICCI) 116వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్లో ఘనంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో వ్యాపార, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సమావేశంలో చర్చలు జరిపారు.
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలను, యువతను ప్రోత్సహించడం ద్వారానే సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని మంత్రి పిలుపుఇచ్చారు. పారిశ్రామిక పార్కులు, ఉమ్మడి వసతులు, ఆర్థికసాయంతో ఏపీలో ఎంఎస్ఎంఈలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇండియా-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA), ఎన్ఆర్ఐ వర్గాల సహకారంతో స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఎస్ఐసిసిఐ అధ్యక్షుడు అరుణ్ అలగప్పన్ మాట్లాడుతూ 2047 నాటి భారత వికాస లక్ష్యాలు చిన్న తరహా పరిశ్రమల (MSME) ప్రగతిపైనే ఆధారపడి ఉన్నాయని.. తమిళనాడు సాధించాలనుకుంటున్న ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ నిర్దేశించుకున్న ‘స్వర్ణాంధ్ర @2047’ లక్ష్యాల సాధనలో చిన్న పరిశ్రమలే కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మద్రాస్ యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, లయోలా ఇన్స్టిట్యూట్, త్యాగరాజ కాలేజ్, భారతిదాసన్ యూనివర్సిటీ విద్యార్థులకు మంత్రి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం ఎస్ఐసిసిఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎన్. శివ శంకర్ ధన్యవాద సమర్పణతో ముగిసింది.
Prajavartha Online Telugu News