నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ పధకాన్ని మహిళా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి కోరారు. నూజివీడు మండలం బోర్వ0చ లో జగనన్న పాలవెల్లువ పధకం అమలుపై మహిళా పది రైతులు, సిబ్బందితో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నూజివీడు డివిజన్ లోని 14 మండలాలలోని 160 రైతు భరోసా కేంద్రాల పరిధిలో జగనన్న పాలవెల్లువ పధకం అమలు కోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 13వ తేదీ నుండి ఆయా గ్రామాలలో అమూల్ సంస్థ చే పాల సేకరణ జరుగుతుందన్నారు. ఇందుకోసం మహిళా సంఘాలతో గ్రామ సంఘం ఎంపిక, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ నియామకం, పాల సేకరణ నిమిత్తం రూట్ మాపింగ్ , ఖాతాల నిర్వహణ, తదితర అంశాలపై అన్ని మండలాల పరిధులలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న పాలవెల్లువ పధకంలో ఎటువంటి సంశయం లేకుండా ప్రతీ పాడి మహిళా రైతు పాలు సేకరణలో పాలుపంచుకుని అభివృద్ధి చెందాలన్నారు. మహిళలు పాలను కేంద్రమునకు తీసువెళ్లి ఇవ్వవలసిన అవసరం లేదని, అమూల్ సంస్థ ప్రతినిధులు మీ వద్దకే వచ్చి పాల సేకరణ చేస్తారని, ఏజెంట్లు, మధ్యవర్తులు లేకుండా లాభాలు నేరుగా మహిళలకు అందిచడం జరుగుతుందన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు ఎన్నో లాభాలున్నాయని, పాడి పశువులకు పౌష్టికాహారంతో కూడిన దాణా, గేదెలు కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు పొందవచ్చన్నారు. మహిళల కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న పాలవెల్లువపధకం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేలా మహిళలు సహరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లారావు, వెలుగు ఏ పిఓ రాజశేఖర్, ఎంపిడిఓ జి. రాణి, పశుసంవర్ధక శాఖాధికారి జి. ఉమ, పాలవెల్లువ రూట్ ఆఫీసర్ కె. పూర్ణచంద్రరావు, గ్రామ సర్పంచ్ ఉదయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News