తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చాడు. కొవిడ్ నిబంధనల మేరకు వాహన సేవలను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. సూర్యప్రభ వాహనంతో మొదలైన ఒక్కరోజు బ్రహ్మోత్సవాలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథసప్తమి మహోత్సవంలో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. వాహనసేవల్లో పరిమిత సంఖ్యలోనే తితిదే అధికారులు, బోర్డు సభ్యులను అనుమతించే అవకాశం ఉంది. ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంతోపాటు తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో ఏడు టన్నుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు.
అరసవల్లిలో ఘనంగా వేడుకలు…
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యభగవానుడికి తొలిపూజను ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేశారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
మంత్రాలయంలో రథసప్తమి వేడుకలు…
ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారి మూల బృందానికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం ప్రాకారంలో స్వామి వారి మూల విరాట్ను పంచ రథోత్సవంపై ఊరేగించారు. స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
శ్రీశైలంలో వైభవంగా సూర్యారాధన వేడుకలు…
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభమల్లికార్జున స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన వేడుకలు నిర్వహించారు. వైదికాచార్యులచే ఆయా బీజమంత్రాలు, ప్రత్యేక ముద్రలతో సూర్యనమస్కారాలు చేశారు. సూర్యభగవానుడికి ఉత్తరపూజనము, నివేదన, మంత్రపుష్పమును అర్చకులు నిర్వహించారు.
Prajavartha Online Telugu News