నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ అన్నారు. నూజివీడు మండలం సిద్దార్ధనగర్ లో గురువారం జగనన్న పాల వెల్లువ పథకంపై మహిళా పాడి రైతులు, ప్రమోటర్లు, అధికారులు, సిబ్బందితో జేసీ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువతో జిల్లాలోని మహిళా పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాదిస్తున్నారన్నారు. ఈ పథకంపై గ్రామాలలోని మహిళా పాడి రైతులలో మరింత అవగాహన కలిగించి పధకం ప్రయోజనాలను ప్రతీ మహిళా పాడి రైతు వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతీ గ్రామంలోనూ జగనన్న పాలవెల్లువ ద్వారా కలుగుతున్న ప్రయోజనాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయా కార్యక్రమంలో జగనన్న పాలవెల్లువ పధకం ద్వారా అభివృద్ధి సాధించిన మహిళా పాడి రైతులతో వారి ఆర్థికాభివృద్ధి అంశాలను ఇతర రైతులకు తెలియజేయాలన్నారు. అవగాహనా కార్యక్రమాలకు గ్రామంలోని మిగిలిన పాడి రైతులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రెవిన్యూ, పశుసంవర్ధకశాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News