గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గుడివాడ పట్టణంలోని 17వ వార్డ్ సచివాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకస్మికంగా సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించి ప్రభుత్వ ఆశయం మేరకు పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను సచివాలయ పరిధిలోని ప్రజలందరికీ అవగాహన కలిగించి, ఆయా పధకాలను వారు సద్వినియోగం చేసుకునేలా చేయవలసిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. ప్రజలు స్థానిక సమస్యలపై అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల సమాచారాన్ని నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. సంక్షేమ పధకాల లబ్ధిదారుల వివరాలు, అనర్హుల వివరాలను నోటీసు బోర్డులో తప్పనిసరిగా ఉంచాలన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నివాస్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News