– శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం సుసంపన్న, శక్తివంతమైన దేశంగా అవతరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, “నా దేశ ప్రజలకు సేవ చేయడానికి నాకు మరింత శక్తినివ్వాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించిన్నట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో దేశం త్వరలో అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తుంది” అని ఆయన చెప్పారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఓఎస్డీ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News