-63వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన నభూతో న భవిష్యత్ అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ 274, 276, 277, 278, 279 వార్డు సచివాలయాల పరిధి రాజీవ్ నగర్లో జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి బుధవారం ఆయన పాల్గొన్నారు. తొలుత రాజీవ్ నగర్ సెంటర్లో పార్టీ జెండాను ఎగురవేసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల బోర్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లాది విష్ణు ప్రసంగిస్తూ.. జగనన్న పాలనకు, గత చంద్రబాబు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజల వద్దకు పాలన చేరువ చేసి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా ప్రజల వద్దకే పాలన వెళ్తోందన్నారు. ఇంటి వద్దకే రేషన్, పింఛన్ వస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టదని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. 274 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా అక్షరాలా రూ. 19.18 కోట్ల మేలు చేకూర్చగా.. 276 వ సచివాలయ పరిధిలో రూ. 20.73 కోట్లు., 277 వ సచివాలయ పరిధిలో రూ. 35.77 కోట్లు., 278 వ సచివాలయ పరిధిలో రూ. 25.73 కోట్లు., 279 వ సచివాలయ పరిధిలో రూ. 19.51 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం ఉండదని.. కానీ అమ్మఒడి, ఆసరా తీసుకునే ప్రతి అక్కచెల్లెమ్మకు, పింఛన్ తీసుకునే అవ్వాతాతలందరికీ సీఎం జగన్ గుర్తుకొస్తారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిగా ఆయనను ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు. బాబు హయాంలో సింగపూర్, మలేషియా పర్యటనలు తప్ప పేదరికాన్ని చాలా తేలికగా తీసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలను భయపెట్టి, దోచుకుంటూ చంద్రబాబు పాలన చేస్తే.. సీఎం వైఎస్ జగన్ పేదల ఆకలి తీరుస్తూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. కనుక చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వటానికి రాష్ట్ర ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, యరగొర్ల శ్రీరాములు, టెక్యం కృష్ణ, సీహెచ్ రవి, అనిల్, బెవర నారాయణ, తిరుపతిరావు, నాగేశ్వరరావు, సామ్రాజ్యం, పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News