Breaking News

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చింది

-శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ కు ఇండస్ట్రీయల్ జోన్ కావాలి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
-శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
-శ్రీసిటిలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన, మరో 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు
-రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు..
-మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు
-శ్రీసిటీలో ఫైర్ స్టేషన్ ప్రారంభం, పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన
-శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం

శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు గా పారిశ్రామికరంగం వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్టివ్ ఇండస్ట్రీయల్ జోన్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం…మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు శ్రీసిటీ చిరకాల వాంఛ అయిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటిలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయి. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయం అన్నారు.

“1991లో దేశంలో ఎకనమిక్ రిఫార్మ్స్ మొదలయ్యాయి. 1995లో నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను. ఇప్పుడు నాల్గోసారి సీఎం అయ్యాను. నేను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఎకనమిక్ రిఫార్మ్స్ స్టార్ట్ చేశాను. అప్పట్లోనే విజన్ 2020కి రూపకల్పన చేసి అమలు చేశాం. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్‌ను ఐటీ ప్రపంచపటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పాను. ఈరోజు రిజల్ట్ అందరూ చూస్తున్నారు. పీ3 మోడల్ లో హైటెక్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. హైదరాబాద్‌లో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు కల్పించాం’’ అని అన్నారు.

“శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది నా ఆలోచన. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. శ్రీసిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు చేపడతాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించాలి, ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అని అన్నారు. తక్కవ ఖర్చుతో ఉత్పత్తులు చేసేందుకు శ్రీ సిటీ వేదిక కావాలని సీఎం అన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నాలుగేళ్లు నెంబర్ వన్ గా ఉన్నాం. 2029 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుంది. నాకు నమ్మకం ఉంది. భారతీయులు ప్రతి రంగంలోనూ సృష్టికర్తలుగా ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు భారతీయులు ఉంటారు. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అదీ ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఏ రంగం చూసుకున్నా అందులో ఇండియన్స్ ఉంటున్నారు. ఇప్పటికే మేము విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రానున్న 25 సంవత్సరాల్లో 15 శాతం వృద్ధి రేటు మా లక్ష్యం. జీరో పావర్టీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. పీ4 మోడల్ అమలు చేస్తున్నాం. టాప్ 10 శాతంలో ఉన్నవారు కింది 20 శాతంలో ఉన్నవారికి సాయం అందించాలి. డెమోగ్రఫిక్ మేనేజ్‌మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తాం. అనుకూల వాతావరణం కల్పిస్తాం. డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తాం. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్ మా లక్ష్యం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం అని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సీఎం ఒక్కసారి కూడా శ్రీసిటీని సందర్శించలేదు. కానీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసిటీకి వచ్చారు. సీబీఎన్ అంటేనే ఒక బ్రాండ్. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు విజన్ కు తగ్గట్టుగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అన్నారు.

జపనీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాడోసన్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్కి అభినందనలు. శ్రీసిటీలో పరిశ్రమల స్థాపనకు మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించారు. ఇప్పటికే పలు జపనీస్ కంపెనీస్ శ్రీసిటీలో నెలకొల్పడం జరిగింది. కంపెనీలకు మరింత సపోర్ట్ చేసేందుకు, ప్రోత్సాహం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రావడం సంతోషకరం అన్నారు.

టొరే ప్రతినిధి  అజయ్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం సంతోషంగా ఉంది. నాడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్‌లో మేం కూడా భాగస్వామ్యమయ్యాం. 2016లో శ్రీసిటీలో 4 ఫ్లాంట్స్ ను ఏర్పాటు చేశాం అని తెలిపారు.

ఇసుజు ప్రతినిధి  మిట్టల్ మాట్లాడుతూ.. ఇసుజు ఇప్పుడు ‘లార్జెస్ట్ ఎక్స్ పోర్టర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్ ఫ్రమ్ ఇండియా’ అయ్యింది. మా పరిశ్రమలో 20 శాతం మహిళలు ఉపాధి కల్పించాం. ఒక లక్ష వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాం. ఆ కార్యక్రమానికి మీరు (సీఎం) అతిథిగా రావాలని కోరుతున్నాం.

డైకిన్ ప్రతినిధి నిమ్మగడ్డ కుటుంబరావు మాట్లాడుతూ….రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కి శుభాకాంక్షలు. 2017లో జననీస్ కంపెనీస్ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అందులో డైకిన్ కంపెనీ ఒకటి. శ్రీసిటీలో 75 ఎకరాల్లో డైకిన్ పరిశ్రమ ఏర్పాటు చేశాం. ఆ తర్వాత మరో 35 ఎకరాల్లో, దాని తర్వాత మరో 200 ఎకరాలకు విస్తరించాం. ఇప్పుడు శ్రీసిటిలోని డైకిన్ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమల రావు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ & ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, శ్రీసిటీ యాజమాన్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *