తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా నందు అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పట్ల భారత గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేసి పేదలకు నరెగా ఒక గొప్ప వరం అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరును పరిశీలించుటకు మూడు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన వీరు ముందుగా జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ను స్థానిక కలెక్టరేట్ నందు కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ సదరు భారత డిప్యూటీ సెక్రెటరీకి జిల్లాలో అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను, ప్రగతిని వివరించారు.
తదుపరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర జాయింట్ కమిషనర్ శివప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో నరేగా కింద వివిధ పనులు చేపడుతున్న శాఖలతో మరియు నరేగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ రాష్ట్రస్థాయిలో నరెగా కింద జరుగుతున్న వివిధ పనుల ప్రగతిని వారికి వివరించారు. తిరుపతి జిల్లా పిడి జిల్లాలో జరుగుతున్న నరెగా పనుల ప్రగతిని పూర్తిస్థాయిలో డిప్యూటీ సెక్రటరీ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా తెలియజేయడంపై డిప్యూటీ సెక్రటరీ గారు ప్రత్యేకంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సదరు నరెగా పనుల పురోగతి బాగుందని పిడి ని అభినందించి సంతృప్తి వ్యక్తం చేశారు. రేపు ఎల్లుండి రెండు రోజులు సదరు డిప్యూటీ సెక్రెటరీ క్షేత్ర స్థాయిలో నరెగ అమలు తీరును పరిశీలించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శంకర్ నారాయణ, ఆర్డబ్ల్యుఎస్ విజయ్ కుమార్, నరెగ అధికారులు, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News