గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై, రోడ్ల మీద ఆక్రమణలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణం తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం లాలాపేట, పట్నం బజార్ లోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల మీద ఉన్న ఆక్రమణలను డిసిపి శ్రీనివాసరావు, ఏసిపి అజయ్ కుమార్, టిపిఎస్ సువర్ణ కుమార్ లు అక్రమ ఆక్రమణ దళంతో తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ల పై ఆక్రమణల వలన వ్యర్ధాలు అడ్డుపడి వర్షం నీరు రోడ్ల మీదకు, ఇళ్లల్లోకి వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ చేయడానికి కూడా డ్రైన్ లో పారుదల లేక సాధ్యం కావడంలేదన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా డ్రైన్ల ఆక్రమణలను వార్డ్ సచివాలయాల వారీగా పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో గుర్తించి, వాటి తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ట్రాఫిక్ కి ఆటంకం కల్గించే విధంగా ఉన్న రోడ్లపై ఆక్రమణలను కూడా తొలగిస్తామన్నారు. నగర ప్రజలు కూడా ప్రధాన డ్రైన్ల వివిధ వ్యాపారాల పేరుతొ ఆక్రమణ చేసుకోవద్దని, తప్పనిసరిగా డ్రైన్ కి వెనుక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రైన్ల మీద, డ్రైన్ కి ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News