– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న అర్జీలకు అధికారులు నాణ్యమైన పరిష్కారాన్ని చూపడం ప్రధానమని.. విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడిన ఈ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన.. పౌర సరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీకుమారితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, అర్జీదారుని సమస్యను సరైన విధంగా అర్థం చేసుకొని పరిష్కరించాలని సూచించారు. నిర్దేశ గడువులోగా అర్జీలను పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అర్జీల పరిష్కారంపై జిల్లా, మండలస్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని, నాణ్యత పెరిగేలా అర్జీదారులకు భరోసా కల్పించేలా పనిచేయాలన్నారు.
పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 94 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ-37, పోలీస్-14, ఎంఏయూడీ-14, పంచాయతీరాజ్-6, సర్వే-1, కోఆపరేటివ్-1, ఆరోగ్యం-1, సాంఘిక సంక్షేమం-3, పౌర సరఫరాలు-3, బ్యాంకింగ్-2, మైన్స్ అండ్ జియాలజీ-2, ఏపీఎఎస్ఆర్టీసీ-1, గ్రామీణ నీటి సరఫరా-1, జాతీయ రహదారులు-1, ఎక్సైజ్-1, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం-1, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్-1, ఉపాధి కల్పన-1, కాలుష్య నియంత్రణ బోర్డు-1, ఇంటర్మీడియెట్ విద్య-1, వ్యవసాయం-1 ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News