-మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లకు సరఫరా
-సాధారణ ధరలకు విక్రయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. టమాటా, ఉల్లి ధరల పెరుగుదల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ కార్యదర్శి అహ్మద్ బాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి నేరుగా టమాట, ఉల్లి సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 1.35 లక్షల కేజీల టమాటా, ఉల్లి 21 వేల కిలోలు రైతుల నుంచి సేకరించి వాటిని రైతు బజార్లకు సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సాధారణ ధరలకు టమాట, ఉల్లి విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే ధరల పట్టిక తప్పని సరిగా ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Prajavartha Online Telugu News