విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులను జిల్లాలోని రైతు బజార్లు, హౌల్ సేల్, రిటైల్ దుకాణాలలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. జాయింట్ కలెక్టర్ నిధి మీనా బుధవారం నందిగామ రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ కౌంటర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాంగా జిల్లాలోని అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచామన్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. బహిరంగ మార్కెట్లలో రూ.125 ధర ఉన్న పాముయిల్ ను 110 రూపాయలకు, 135 రూపాయల ధర ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ను 124 రూపాయలకు, కిలో 150 రూపాయలకే కందిపప్పు, కిలో 47 రూపాయలకే టమాటాలు వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని రైతు బజార్లు,సంస్థాగత రిటైల్ దుకాణాలలో సరసమైన ధరలకు నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు.
Prajavartha Online Telugu News