-విద్యా మంత్రి లోకేష్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలో మహిళా సాధికారికతపై గట్టి సందేశం పంపే విధంగా రాయలసీమలో మహిళలకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ కు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత్రుత్వంలో సమైక్య, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వారి కోసం అంతర్జాతీయంగా ఎదురైన అనేక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సాధించిందని ఆయన మంత్రి లోకేష్ కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మనం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో పయనిస్తున్న తరుణంలో జనాభాలో సగం వున్న మహిళలకు స్థిరమైన అభివృద్ది
అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ద్రుష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా రాయలసీమ సామాజిక ఆర్ధిక పరిస్థితులను, విభిన్నమైన పాలనను అందించాలన్న ఎన్డీయే కూటమి సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన లేఖలో స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని అనంతపురం జెఎన్టియు ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్)ను ఆయన తన లేఖతో జత చేశారు. ఈ డిపిఆర్ ను పరిశీలించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి నారా లోకేష్ ను లేఖలో కోరారు.
Prajavartha Online Telugu News