-రాజమహేంద్రవరంలో జీఎస్ఎల్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో నిర్వహణ
-ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్
-జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్
-రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించిన మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకంగా 5 కే రన్ నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఆదివారం ఉదయం జీఎస్ఎల్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో 5కే రన్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన అంశంపై 5కే రన్ నిర్వహించడం వారి సామాజిక బాధ్యతకు నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణ కోసం, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేసే విధంగా 5కే రన్ కార్యక్రమం కొనసాగిందన్నారు. జీఎస్ఎల్ యాజమాన్యం తరపున డా.గన్ని భాస్కరరావు తమ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ పై ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విజయవంతంగా నిర్వహించారన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం మంచి నిర్ణయం అన్నారు.
ఈ సందర్భంగా 5కే రన్ కార్యక్రమంలో పాల్గొన్న యువ డాక్టర్లకి మంత్రి దుర్గేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
కార్యక్రమంలో జీఎస్ఎల్ కాలేజీ చైర్మన్ డా.గన్ని భాస్కరరావు , డాక్టర్లు హరికృష్ణ, తరుణ్, ఇతర యువ డాక్టర్లు అధికారులు, కూటమినేతలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News